అభివృద్ధి, సంక్షేమంపై Mlc Thota Trimurthulu కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
అభివృద్ధి, సంక్షేమంపై Mlc Thota Trimurthulu కీలక వ్యాఖ్యలు
X
  • రూ.1.93 కోట్లతో ఇందిరాగాంధీ బైపాస్ రోడ్డు
  • కళ్ళున్న వారికే ఇవన్నీ కనబడతాయి
  • ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే వేగుళ్లపై సెటైర్లు

దిశ, మండపేట: వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం పరుగు తీస్తోందని అందుకు మండపేట పట్టణంలో అద్భుతంగా రూపు దిద్దుకుంటున్న రోడ్లే దానికి నిదర్శనమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన సమీక్షించారు. సోమవారం 12 వ వార్డు పరిధిలో ఉన్న ఇందిరాగాంధీ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను వార్డు కౌన్సిలర్ మలసాని సీతామహలక్ష్మి, పార్టీ నాయకుడు శిరంగు శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు.14 వ ఆర్థిక సంఘం నిధులు రూ 1.93 కోట్లతో పూర్తి చేస్తున్న బైపాస్ రోడ్డును ఆయన సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అద్భుతంగా రోడ్డు రూపుదిద్దుకుందన్నారు. పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం దృఢంగా పది కాలాల పాటు స్థిరంగా ఉండే విధంగా నిర్మాణం జరిగిందన్నారు.

అయితే అది చూసి ఓర్వలేక ఎమ్మెల్యే వేగుళ్ల లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గతంలో తాము ఇదే రోడ్డును 9 మీటర్ల వెడల్పు ఉండేలా ప్రతిపాదనలు చేశామని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో బైపాస్ రోడ్డు నాలుగున్నర మీటర్లు మాత్రమే ఉండేదన్నారు. అయితే దాన్ని వాహన రాకపోకలను దృష్టిలో పెట్టుకొని పెంచడం జరిగిందన్నారు. అదనంగా మరో రెండున్నర మీటర్లు పెంచి మొత్తంగా 7 మీటర్లు రోడ్డుగా తీర్చిదిద్దామని తెలియజేశారు. ఉన్నదే 7 మీటర్లు ఉంటే 9 ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. అలా నిర్మిస్తే పక్కనే ఉన్న పిల్ల కాలువలో రోడ్డు వేయాల్సి వస్తుందని వ్యగ్యంగా అన్నారు. ఏదైనా మాట్లాడితే ప్రజలు హర్షించాలన్నారు. సిగ్గు మాలిన మాటలు మాట్లాడటం ఎమ్మెల్యే వేగుళ్ళ మానుకోవాలన్నారు. అభివృద్ది పనులు జరిగేటప్పుడు ఆ పనుల్లో లోపాలు ఏమైనా ఉన్నట్టయితే దాన్ని తెలియజేస్తే సరిదిద్దుకుంటామే గానీ ఎంతో అందంగా జరిగే పనులకు వంకలు పెట్టడం తగదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించి వారి ఇబ్బందులు తొలగించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మండపేటలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి పనులు చూసి ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. మారేడుబాక వంతెన నుండి న్యూ కాలనీ చివర వంతెన వరకూ కిలోమీటరు పొడవు రోడ్డు నిర్మాణం మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుందన్నారు. అక్కడి నుండి రాజారత్న జంక్షన్ వరకూ రెండో విడతలో పనులు ప్రారంభించి అది కూడా త్వరలోనే ప్రజలకు అప్పగిస్తామని చెప్పారు. అనంతరం డిఈ సత్యనారాయణను పట్టణంలో జరిగే పలు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ కలుగకుండా పనులన్నీ పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముమ్మిడివరపు బాపిరాజు, నేమాని శ్రీనివాస్, సాధనాల శివ భగవాన్, పులగం శ్రీనివాస్, మలసాని అప్పన్న, శాకా బుజ్జి, సలాది వెంకటేశ్వరరావు, ఏఈ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

READ MORE

విభజనతో మరింత దగ్గరవుతున్న తెలుగు ప్రజలు

Next Story

Most Viewed